ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు అక్రూరుని పాండవుల సేమము నరయుటకై హస్తినాపురికిఁ బుత్తెంచుట
“అనఘ! పితృపివ్యుండ వాత్మబంధుఁడవు
సరసవాక్ప్రౌఢివి సౌమ్యచిత్తుఁడవు
పరమాప్తుఁడవు మాకు బంధులలోన
నీయట్టి చెలికాఁడు నీయట్టి సుకృతి
నీయట్టి సుజ్ఞాననిధి యెందుగలఁడు?
మాతండ్రియట్లట్ల మమ్ము శిక్షించి
యీతెఱంగని చెప్పుదేకార్యమైన”;
ననిపల్కి కమలాక్షుఁ డక్రూరుఁ జూచి
తనరార బాంధవత్వముఁదోఁపఁ బలికె.
“ఆనకదుందుభియనుజ! ధర్మాత్మ!
మేనత్తమాకు నర్మిలి తల్లికంటె
పెనిమిటి గడచన్న బిడ్డలుఁ దాను
మనపట్టు లేక యున్మలికతోఁ గొంతి. - 450
క్రూరాత్ముఁడగు బావ కుదురునేయున్న
యారాజపుత్రులు యసమసాహసులు
తమ్మునిపాలుఁ దత్తనయులకిచ్చి
నెమ్మదినుండగ నేరఁడా నృపతి
వారికి వీరికి వసుధకైఁ బోర
నీరసంబున మీఁద నెట్లుగాఁ గలదొ?
కరిపురి కేఁగి యక్కడ పాండునుతుల
నరసి యిచ్చటి సేమమంతయుఁ జెప్పి
xగర్వితుఁడగు కంసుఁ గడపి తజ్జనకు
నుర్వి యేలింపుచున్నారమననుము
దృతరాష్ట్రుచందంబుఁ దెలిసి యారాజ
మతులెల్లఁ దెలిసి క్రమ్మర వేగరమ్ము
పొమ్మందఱకుఁ గట్నములు భూషణములు
ని”మ్మంచు దెప్పించి యిచ్చి యాలోన
నుద్ధవుండును దాను నొగియింటి కరిగి
బద్ధానురాగుఁడై పద్మాక్షుడుండె.